Showing posts with label కోర్టు తీర్పులు. Show all posts
Showing posts with label కోర్టు తీర్పులు. Show all posts

Thursday, October 6, 2016

మద్య నిషేధం పిల్‌ పరిశీనకు సుప్రీంకోర్టు తిరస్కరణ


దేశవ్యాప్తంగా మద్యాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) పరిశీలించడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజ్యాంగం ప్రకారం జాతీయ మద్యం విధానం అనేది ఆదేశిక సూత్రాల్లో భాగమని, ఇందులో కార్యనిర్వాహక వర్గానికి అన్ని హక్కులు ఉన్నాయని జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఎన్‌వీ రమణతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ పిల్‌ను పరిశీలించలేమని స్పష్టం చేసింది. దీంతో పిల్‌ను దాఖలు చేసిన న్యాయవాది, ఢల్లీ బీజేపీ అధికార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ్‌ దాన్ని ఉపసంహరించుకున్నారు.

Wednesday, October 5, 2016

భారత్‌పై ‘మార్షల్స్‌ అణ్వాయుధ కేసు’ తిరస్కరణ


‘అణ్వాయుధ పోటీ’ని అడ్డుకోవడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ.. భారత్‌తోపాటు పాకిస్థాన్‌, బ్రిటన్‌లపై మార్షల్‌ ఐలాండ్స్‌ పెట్టిన ‘చరిత్రాత్మక కేసు’ను ఐక్యారాజ్య సమితి  అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై 16 మంది న్యాయమూర్తులతో కూడిన అంతర్జాతీయ న్యాయస్థాన (ఐసీజే) ట్రైబ్యునల్‌ 2016 అక్టోబర్ 5న విచారణ చేపట్టింది. ‘భారత్‌, పాక్‌, బ్రిటన్‌లతో మార్షల్‌ ఐలాండ్‌కు పాత వివాదాలున్నట్లు సాక్ష్యాలేమీ కనిపించడం లేదు. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోండి’అని ట్రైబ్యునల్‌కు నేతృత్వం వహించిన న్యాయమూర్తి రోనీ అబ్రహాం తీర్పునిచ్చారు. అంతేకాదు భారత్‌, పాక్‌, బ్రిటన్‌ లేవనెత్తిన అభ్యంతరాలకు ఆయన మద్దతు పలికారు. తీర్పు వెలువడిన అనంతరం.. దీనిలోని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తామని మార్షల్స్‌ తరఫున న్యాయవాది ఫోన్‌ వాన్‌ డెర్‌ బీసెన్‌ తెలిపారు. ఈ ఆదేశాలపై అప్పీలుకు వెళ్లే అవకాశం లేదు. మార్షల్‌ ఐలాండ్స్‌కు చెందిన ప్రిస్టైన్‌ అటాల్స్‌ ప్రాంతంలో 1946-58 మధ్య కాలంలో అమెరికా విధ్వంసకర అణు పరీక్షలను నిర్వహించింది. దీంతో ఈ పసిఫిక్‌ ద్వీప దేశంలోని పలు ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని వేల ఏళ్లపాటు నివాసయోగ్యానికి పనికిరాకుండా మారిపోయాయి. దీంతో అణు బాంబుల సమీకరణను అడ్డుకునేందుకు సిద్ధంచేసిన అణ్వస్త్రాల నిరోధక ఒప్పందం-1968కు అన్ని దేశాలూ కట్టుబడి ఉండాలని మార్షల్స్‌ పట్టుబట్టింది. అనంతరం 2014లో ఈ ఒప్పందంలోని అంశాలను ఆచరణలో పెట్టడంలో విఫలమయ్యాయంటూ 9 దేశాలకు వ్యతిరేకంగా ఐసీజేను ఆశ్రయించింది.

Tuesday, September 20, 2016

సింగూరు భూమి రైతులకిచ్చేయండి : సుప్రీంకోర్టు


పశ్చిమ బెంగాల్‌లోని సింగూరు భూసేకరణను సుప్రీంకోర్టు 2016 ఆగస్టు 31న కొట్టేసింది. మొత్తం 1053 ఎకరాల భూమిపై హక్కులను 12 వారాల్లోగా రైతులకు పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో రైతులకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారాన్ని వెనక్కి తీసుకోరాదని, 10 సం॥ పాటు రైతు భూమికి దూరంగా ఉన్నందున ఆ మొత్తం రైతుకే చెందుతుందని తీర్పు చెప్పింది. టాటా సంస్థ నానో కార్ల తయారీ కేంద్రం ఏర్పాటు కోసం పదేళ్ల కిందట అప్పటి వామపక్ష ప్రభుత్వం సింగూరులో భూసేకరణ చేసింది.

Friday, September 9, 2016

FIRను 24 గం॥ల్లో ఆన్‌లైన్‌లో ఉంచాలి : సుప్రీం


పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన 24 గంటల్లో ప్రథమ సమాచార నివేదిక(FIR)ను ఆన్‌లైన్‌లో ఉంచాని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఇంటర్నెట్‌ సౌకర్యం సరిగా విస్తరించని రాష్ట్రాలకు 72 గంటల గడువును నిర్దేశించింది. సాయుధ పోరాటాలు, మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల FIRను ఇంటర్నెట్‌లో పెట్టాల్సిన పనిలేదని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ సి.నాగప్పన్‌తో కూడిన ధర్మాసనం మినహాయింపు నిచ్చింది.

FIR-First Information Report

Saturday, September 3, 2016

ఢిల్లిలో డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌


దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ 2016 ఆగస్టు 12న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే 2000 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ రిజిస్ట్రేషన్‌కు పర్యావరణ పరిరక్షణ సెస్‌ కింద 1 శాతం ప్రత్యేక రుసుమును సెంట్రల్‌ పొల్యూషన్‌ బోర్డుకు చెల్లించాలని తెలిపింది.

లెఫ్టినెంట్‌ గవర్నర్‌కే ఢల్లీ పాలనాధికారాలు


రాజ్యాంగాన్ని అనుసరించి ఢల్లీ కేంద్ర పాలిత ప్రాంతం గానే కొనసాగుతుందని, లెఫ్టినెంట్‌ గవర్నరే దానికి పాలనాధిపతి అని ఢిల్లీ హైకోర్టు 2016 ఆగస్టు 4న స్పష్టం చేసింది.

Saturday, August 27, 2016

దహీ హండీపై సుప్రీం ఆదేశాలు


శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మహారాష్ట్రలో సంప్రదాయంగా నిర్వహించే దహీ హండీ(ఉట్టి కొట్టే కార్యక్రమం) పై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్సవంలో 18 ఏళ్లు దాటిన వాళ్లు మాత్రమే పాల్గొనాలని, పిరమిడ్‌ ఎత్తు 20 అడుగులకు మించరాదని ఆదేశించింది.

తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషకు ప్రాచీన హోదాపై దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. భాషకు ప్రాచీన హోదా కల్పించే విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ప్రకటించింది. మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌తో కూడిన ప్రథమ ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

Wednesday, August 24, 2016

పాల కల్తీపై కఠినంగా వ్యవహరించాలి : సుప్రీం


పాలు, పాల ఉత్పత్తులను కల్తీ చేసేవారికి గరిష్టంగా యావజ్జీవ శిక్ష పడేలా చట్టాల్లో మార్పు తీసుకురావాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టాన్ని సవరించడం, కల్తీకి పాల్పడటాన్ని శిక్షార్హమైన నేరంగా మార్చడం లాంటి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పాల కల్తీ నేరానికి పాల్పడేవారికి గరిష్ట జైలుశిక్షను జీవిత ఖైదుకు పెంచుతూ పశ్చిమ్‌బంగా, ఒడిశా లాంటి రాష్ట్రాలు ఐపీసీలో సవరణలు తీసుకురావడాన్ని ప్రస్తావించింది.