Saturday, August 27, 2016

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఆసియాలో కెల్లా అతిచిన్న వయస్కురాలు నర్సమ్మ


మెదక్‌ జిల్లా కొల్చారం మండలం రంగంపేటకు చెందిన విద్యార్థిని దామని నర్సమ్మ (11) ఆఫ్రికా ఖండంలోనే ఎత్తయిన పర్వతాన్ని 160 మందితో అధిరోహించి ఆసియాలోనే ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డు నమోదు చేసింది. మెదక్‌ జిల్లాలోని కేజీబీవీల్లో చదువుతున్న 9 మంది విద్యార్థినులతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సంక్షేమ వసతి గృహాలకు చెందిన 12 మంది బృందం 2016 ఆగస్టు 8న టాంజానియాలోని కిలిమంజారో పర్వతారోహణకు బయలుదేరి వెళ్లి, ఆగస్టు 14న ఈ పర్వతాన్ని అధిరోహించారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడే భారత పతాకాన్ని ఎగరేశారు. ఆ బృందంలో నర్సమ్మ కూడా ఉంది. ఈ బృందంలో అతి చిన్న వయస్కురాలుగా నర్సమ్మ మరో రికార్డు దక్కించుకుంది. కిలిమంజారో పర్వతాన్ని 2006లో 10 ఏళ్ల 11 రోజుల వయసులో కాలిఫోర్నియాకు చెందిన బాలిక జోర్డాన్‌ రొమెరో అధిరోహించింది. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఆ పర్వతాన్ని అధిరోహించిన రికార్డు సొంతం చేసుకుంది. 2014 అక్టోబరు 2న  హైదరాబాద్‌కు చెందిన జాహ్నవి 12 ఏళ్ల 11 నెల ల వయసులో ఈ పర్వతాన్ని అధిరోహించి ఆసియాలోనే అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సొంతం చేసుకొంది. 2004 ఆగస్టు 22న జన్మించిన నర్సమ్మ 11 ఏళ్ల 11 నెలల వయసులో ఈ రికార్డును తిరగరాసింది.

యూఎన్‌ఓ సర్వప్రతినిధి సభలో ఏఆర్‌ రెహమాన్‌ సంగీత విభావరి


భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూయార్క్‌లోని యూఎన్‌ఓ సర్వప్రతినిధి సభలో ఆస్కార్‌ విజేత, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ తన బృందంతో సంగీత విభావరి నిర్వహించారు. విశ్వవిఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి దివంగత ఎంఎస్‌ సుబ్బలక్ష్మి నాడు ఆలపించిన రాగాలను ఏఆర్‌ రెహమాన్‌ ఆలపించారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభా ప్రాంగణంలో కచేరి నిర్వహించిన తొలి భారత సంగీత ద్రష్టగా చరిత్రలో నిలిచిపోయిన ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి శత జయంతి సంవత్సరం ఇది. ఆమె ఆ వేదికపై కచేరి చేసిన వజ్రోత్సవం కూడా. 1996లో అప్పటి యూఎన్‌ఓ సెక్రటరీ జనరల్‌ యూథాంట్‌ ఆహ్వానం మేరకు ఎంఎస్‌ అక్కడ కచేరి నిర్వహించారు. ఎంఎస్‌ శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని యూఎన్‌ఓ జనరల్‌ అసెంబ్లీలో ఆమె జీవితంలోని వివిధ ఘట్టాలను ప్రతిబింబించే ఫొటో ప్రదర్శనలను ప్రారంభించారు. ఇన్ని ప్రత్యేకతల నేపథ్యంలో ఆమెకు ఘన నివాళిగా రెహమాన్‌ తన సంగీత విభావరి నిర్వహించారు. ఎంఎస్‌ తర్వాత యూఎన్‌ఓలో కచేరి చేసిన రెండో వ్యక్తిగా రెహమాన్‌ గౌరవాన్ని పొందారు

ఫిడేల్‌ క్యాస్ట్రో 90వ జన్మదిన వేడుకలు


క్యూబా పోరాట యోధుడు, మాజీ అధ్యక్షుడు ఫిడేల్‌ క్యాస్ట్రో 90వ పుట్టిన రోజును 2016 ఆగస్టు 13న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యూబావాసి జోస్‌ క్యాసెలార్‌ 90 మీటర్ల (80 కేజీు) అతిపెద్ద చుట్టను తయారుచేసి క్యాస్ట్రోపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన, పెద్ద సిగార్‌గా ఇది గిన్నిస్‌ రికార్డుకెక్కింది. ఫిడేల్‌ క్యాస్ట్రో 1926 ఆగస్టు 13న జన్మించాడు.

అరుణాచల్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అనుమానాస్పద మృతి


అరుణాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కలిఖోపుల్‌ 2016 ఆగస్టు 7న అనుమానాస్పద స్థితిలో ఇటానగర్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మృతి చెందారు. కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత అయిన పుల్‌ 2016  ఫిబ్రవరి 19 నుంచి జులై 13 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని జులైలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయన సీఎం పదవి నుంచి తప్పుకున్నారు.

నయీం హతం


హత్యలు, దోపిడీలు, బెదిరింపులు, భూదందాలతో కరడుగట్టిన నరహంతకుడు, సూడో నక్సలైట్‌  నయీం మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. ఐపీఎస్‌ అధికారి వ్యాస్‌, మాజీ నక్సలైట్లు ఈదన్న, బెల్లి లలిత, పటోళ్ల గోవర్థన్‌రెడ్డి, పౌర హక్కుల సంఘం నేతలు పురుషోత్తం, అజీం అలీ తదితరులు హత్యల్లో నయీం నిందితుడుగా ఉన్నాడు.

ఐఓసీలో సభ్యత్వం పొందిన తొలి భారత మహిళ నీతా అంబానీ


రియన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ) సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఐఓసీలో సభ్యత్వం పొందిన తొలి భారత మహిళగా 52 ఏళ్ల నీతా ఘనత సాధించారు. 70 ఏళ్ల వయసు వరకు ఆమె ఐఓసీ సభ్యురాలిగా ఉంటారు.

మైక్రోసాఫ్ట్‌ ఇండియా అధ్యక్షుడిగా అనంత్‌ మహేశ్వరి


మైక్రోసాఫ్ట్‌ ఇండియా అధ్యక్షుడిగా అనంత్‌ మహేశ్వరి నియమితులయ్యారు. అనంత్‌ మహేశ్వరి 2017 జనవరి 1న ప్రస్తుత అధ్యక్షుడు భాస్కర్‌ ప్రామాణిక్‌ నుంచి బాధ్యతలు చేపడతారు. దేశవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ ఉత్పత్తులు, సేవలు, అనుబంధ సమర్పణలకు మహేశ్వరి ఆధ్వర్యం వహిస్తారు.