Wednesday, September 14, 2016

Burgula Ramakrishnarao

తెలంగాణా సమర యోధులు : బూర్గుల రామకృష్ణారావు (1899-1967)

హైదరాబాద్ సంస్థాన జాతీయోద్యమ చరిత్రలో బూర్గుల రామకృష్ణారావు నిర్వహించిన పాత్ర, తెలంగాణా విజ్ఞాన, వికాసాలకు ఆయన చే సిన కృషి మరువరానిది. విలీనానికి పూర్వం స్వతంత్ర భారత ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లో ఏజెంట్ జనరల్‌గా ఉన్న కె.ఎమ్. మున్షీ.. ‘హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడంలో బూర్గుల ముందుచూపు, విజ్ఞత, రాజనీతిజ్ఞత, విచక్షణ, మేధావితనం నాకు ఎంతగానో ఉపకరించాయి’ అని ప్రశంసించారు. బూర్గుల గొప్ప న్యాయవాదిగా పేరు పొందారు. ఆయన బహుభాషా కోవిదుడు, పరిపాలనాదక్షుడు, కవి, పండితుడు, విమర్శకుడు.

మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో 1899 మార్చి 13న నరసింగరావు, రంగనాయకమ్మ దంపతులకు బూర్గుల జన్మించారు. బూర్గుల ఇంటిపేరు పుల్లంరాజు. ఆయన స్వస్థలం బూర్గుల కావడంతో అదే ఆయన ఇంటిపేరుగా మారింది.

బూర్గుల 12 ఏళ్ల వయసులో హైదరాబాద్ వచ్చి ధర్మవంత్ పాఠశాలలో ఏడో తరగతిలో చేరారు. నిజాం కళాశాల నుంచి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 1920లో పుణేలోని ఫెర్గూసన్ కళాశాల నుంచి బీఏ ఆనర్స్ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత బొంబాయిలో ఎల్.ఎల్.బి. పట్టా పొందారు. అక్కడే కొంతకాలం అంజుమనె ఇస్లామియా హైస్కూల్లో పారశీక భాష బోధించారు. హైదరాబాద్ సంస్థానం సమస్యల గురించి పత్రికల్లో వ్యాసాలు రాశారు.
బూర్గుల విద్యార్థి దశలోనే ప్రజాహిత కార్యక్రమాల్లో ఆసక్తి చూపేవారు. 1916లో కొంతమంది సహాధ్యాయులతో కలసి వామన నాయక్ అధ్యక్షతన ‘హైదరాబాద్ యంగ్ మెన్స్ యూనియన్’ సంస్థ స్థాపించారు. దీనికి రామకృష్ణారావు కార్యదర్శిగా పనిచేశారు. ఈయనపై పుణే రాజకీయాలు, అక్కడి జాతీయవాదుల ప్రభావం ఉంది. ఈ స్ఫూర్తితో తెలంగాణాలో జాతీయోద్యమానికి కృషి చేశారు.

1921లో మాడపాటి హనుమంతరావుతో కలిసి ఆంధ్ర జనసంఘం స్థాపించారు. ఇది తెలంగాణాలో రాజకీయ, సాంఘిక చైతన్యం కలిగించడానికి విశేషంగా కృషి చేసింది. జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌ల అన్యాయాలను ఎదిరించడం; వెట్టిచాకిరి నిర్మూలన కోసం ఈ సంస్థ కృషి చేసింది. గ్రామాల్లో గ్రంథాలయాలు స్థాపించి వాటి ద్వారా రాత్రి పాఠశాలలు నిర్వహించి విద్యా వికాసానికి ఈ సంస్థ తోడ్పడింది.
1931లో నల్లగొండ జిల్లాలోని ‘దేవరకొండ’లో నిర్వహించిన రెండో ఆంధ్ర మహాసభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ సభ చరిత్రాత్మకమైంది. ఇందులో ‘గస్తీ నిషాన్ తిర్పన్’ సర్క్యులర్ నంబర్ 53ని ఉపసంహరించాల్సిందిగా నిజాం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఈ మహాసభ నిర్వహించుకోవడానికి నిజాం ప్రభుత్వం కొన్ని షరతులతో అనుమతి ఇచ్చింది. అవి.. సభాధ్యక్షుడు రాష్ట్ర నివాసి అయుండాలి. మహాసభలో జరిగే చర్చలన్నీ రాజకీయేతర అంశాలై ఉండాలి. ఏదైనా విషయం ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఉంటే భవిష్యత్తులో ఇలాంటి సభలకు అనుమతి ఇవ్వరు. ఇలాంటి నిబంధనలు పెట్టినప్పటికీ రెండో మహాసభ విజయవంతమైంది.

ఈ సభకు ‘హైదరాబాద్ బులిటెన్’ పత్రికా సంపాదకుడు బుక్కపట్నం రామానుజాచారి (బి.ఆర్.చారి); ‘ప్రజామిత్ర’ సంపాదకుడు, సుప్రసిద్ధ చలన చిత్ర దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం; దేశభక్త బిరుదాంకితులైన వామన నాయక్; సుప్రసిద్ధ సంఘసంస్కర్త బాజీ కిషన్‌రావు; బారిష్టర్ శ్రీనివాస శర్మ తదితరులు హాజరయ్యారు. తెలంగాణాలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశాలన్నింటిలో రామకృష్ణారావు నిర్వహించిన పాత్ర శ్లాఘనీయమైంది. బూర్గుల రామకృష్ణారావు 1927లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయానికి కార్యదర్శిగా పనిచేశారు.
1923లో మౌలానా మహమ్మద్ అలీ అధ్యక్షతన కాకినాడలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభ జరిగింది. హైదరాబాద్ నుంచి వామన్ నాయక్ నాయకత్వంలో వెళ్లిన ప్రతినిధుల్లో రామకృష్ణారావు ముఖ్యులు. ఆ సభలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన నాయకుల ఉపన్యాసాలను రామకృష్ణారావు హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. ఈ అనువాద తీరును సరోజినీ నాయుడు ప్రశంసించారు.

హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్
1936లో సిద్ధనహళ్లి కృష్ణశర్మ, బూర్గుల రామకృష్ణారావు, రామాచారి, రామకృష్ణధూత్, స్వామి రామానంద తీర్థ, గోవిందరావు నానల్ కలిసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనకు కృషి చేశారు. దీంతో కృష్ణశర్మను హైదరాబాద్ రాజ్యం నుంచి బహిష్కరించారు. దీనికి నిరసనగా కొంత మంది నాయకులు సత్యాగ్రహం చేశారు. సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ హైదరాబాద్‌లో అడుగు పెట్టకూడదని నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది. దీన్ని ధిక్కరించిన రామకృష్ణారావు తొలిసారిగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సంస్థానంలోని ప్రజల్లో రోజురోజుకీ రాజకీయ చైతన్యం అధికమవుతోందని నిజాం నవాబు దివాన్ బహద్దూర్ అరవముద్ అయ్యంగార్ అధ్యక్షతన రాజకీయ సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసింది. ఇదే సమయంలో మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన ‘హైదరాబాద్ పీపుల్స్ కన్వెన్షన్’ ఏర్పాటైంది. రామకృష్ణారావు దీనికి కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ కన్వెన్షన్ హైదరాబాద్‌లో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తీర్మానించింది. దీన్ని నిజాం నవాబు పట్టించుకోలేదు. అయ్యంగార్ కమిటీ సిఫారసులు అమలు కాలేదు. ఆ తర్వాత 1938 జూలైలో స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు, కాశీనాథరావు వైద్య, రామకృష్ణదూత్, జె.రామాచారి, డి.జి. బిందూ మొదలైన ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక నాయకులు ‘హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్’ను స్థాపించారు. 1938 సెప్టెంబర్‌లో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో నిజాం ప్రభుత్వం ఆందోళన చెంది సెప్టెంబర్ 9న స్టేట్ కాంగ్రెస్‌ను నిషేధించింది. స్టేట్ కాంగ్రెస్ నిషేధం తర్వాత ఢిల్లీ వెళ్లిన రాయబార వర్గంలో తెలంగాణ నుంచి ఏకైక ప్రతినిధి రామకృష్ణారావు. హైదరాబాద్ ప్రభుత్వం రామకృష్ణారావుకు హైకోర్టు జడ్జీ పదవిని ఆశ చూపగా ఆయన దానికి సమ్మతించలేదు.

పోలీసు చర్య
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమైంది. మేజర్ జనరల్ చౌధురి హైదరాబాద్ రాష్ట్ర మిలటరీ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈయన 1949 వరకు అధికారంలో ఉన్నారు. 1950లో ఎం.కె. వెల్లోడి ముఖ్యమంత్రిగా ‘పౌర ప్రభుత్వం’ ఏర్పడింది. ఇందులో బూర్గుల రామకృష్ణారావు రెవెన్యూ, ఎక్సైజ్, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను భారత ప్రభుత్వం ‘హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్’గా నియమించింది.

బూర్గుల రామకృష్ణారావు 1952 మార్చిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయన ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. 1956 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడేంత వరకూ బూర్గుల ముఖ్యమంత్రిగా కొనసాగారు.

బూర్గుల సంస్కరణలు
హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు అమలు చేశారు. ఏళ్ల తరబడి భూములు సేద్యం చేస్తున్న కౌలుదార్లను ‘రక్షిత కౌలుదార్లు’గా ప్రకటించి వారికి భూమిపై యాజమాన్య హక్కులు కల్పించారు. దీంతో దున్నేవారికి భూమిపై యాజమాన్య హక్కు లభించింది.

హైదరాబాద్‌లో ‘జాగీర్దార్’ వ్యవస్థను రద్దు చేసి జాగీర్దార్లకు నష్ట పరిహారం చెల్లించే ఏర్పాటు చేశారు. వీరి రుణాల పరిష్కారానికి ‘జాగీరు రుణ పరిష్కార సంస్థ’ను నెలకొల్పారు.

నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి ఒక ఇంటర్మీడియెట్ కాలేజీ మాత్రమే వరంగల్లులో ఉండేది. మిగతావన్నీ నగరంలోనే ఉండేవి. రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా తెలంగాణాలోని ప్రతి జిల్లాలో ఒక డిగ్రీ కళాశాల నెలకొల్పి విద్యాభివృద్ధికి కృషి చేశారు. హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల స్వల్ప కాలంలోనే వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించింది.

భారత ప్రభుత్వం భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించి ‘ఫజల్ అలీ’ అధ్యక్షతన ఎస్.ఆర్.సి. నియమించింది. ఫజల్ అలీ రిపోర్టు హైదరాబాద్‌ను విభజించాలని, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని సిఫారసు చేసింది. లేకపోతే 1962 సాధారణ ఎన్నికల వరకు ప్రత్యేకంగా ఉంచి, తర్వాత ఎన్నికైన శాసన సభ్యులు కోరితే ఆంధ్రా ప్రాంతంతో కలపవచ్చని పేర్కొంది. రామకృష్ణారావు ఈ విషయంలో చాలా కాలం మౌనంగా ఉన్నారు. ప్రజలందరూ ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్నే కోరుకుంటునట్లు భావించారు. కానీ ఆయన విశాలాంధ్ర ఏర్పడాలని ప్రకటించారు. ఫలితంగా విశాలాంధ్ర ఉద్యమానికి బలం చేకూరింది.

బూర్గుల-సాహిత్య సేవ
1. బూర్గుల రామకృష్ణారావుకు హైదరాబాద్ రాష్ట్రంలో అన్ని భాషా, సాంస్కృతిక సంస్థలతో సన్నిహిత సంబంధాలుండేవి. ఆయనకు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, పార్శీ, సంస్కృతం, హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లో మంచి పాండిత్యం ఉంది.
2. రామకృష్ణారావు ‘ఉమర్ ఖయాం’ రుబాయిలను కొన్నింటిని ఆంధ్రీకరించారు.
3. బూర్గుల రచించిన ‘ఉర్దూ భాషా సారస్వతములు’ వ్యాసాలు చదివితే ఉర్దూ, పారశీక భాషల్లో ఆయనకు ఉన్న విద్వత్తు గురించి అర్థమవుతుంది.
4. పండిత రాయల సంస్కృత రచనను ‘పండిత రాజ పంచామృతం’ అనే పేరుతో తెలుగులో రచించారు.
5. ‘నవీన వాఙ్మయం - ఎంకి పాటలు’ అనే శీర్షికతో ఆయన అనేక విమర్శనాత్మక వ్యాసాలు రచించారు.
6. రామకృష్ణారావు ‘కాకునూరి అప్పకవి జన్మస్థానం’, ‘రెడ్డి రాజుల కాలపు మత సంస్కృతులు’ అనే పరిశోధనాత్మక చరిత్ర రచనలు చేశారు.
7. ఆంధ్ర సారస్వత పరిషత్తు (హైదరాబాద్) వివిధ పత్రికల్లో అనేక అంశాలపై ఆయన రాసిన వ్యాసాలను క్రోడీకరించి ‘సారస్వత వ్యాస ముక్తావళి’ పేరుతో ప్రచురించింది.
8. డాక్టర్ సి.నారాయణ రెడ్డి రచించిన ‘నాగార్జున సాగరం’ కావ్యం రామకృష్ణారావుకు అత్యంత ప్రీతికరమైంది.
9. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత బూర్గుల 6 సంవత్సరాలు కేరళ, ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పని చేశారు. కొంతకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
1960లో బూర్గుల షష్టిపూర్తి ఉత్సవం హైదరాబాద్‌లో జరిగింది. భారత సేవా సమాజ్, భారతీయ విద్యా భవన్, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, తెలంగాణా రచయితల సంఘం మొదలైన సంస్థల ప్రతినిధులు షష్టి పూర్తి మహోత్సవ సభలో పాల్గొని ఆయనను సత్కరించారు.
దేశభక్తుడు, మేధావి, తెలంగాణ జాతీయోద్యమ యోధుడు, పరిపాలనాదక్షుడు, నవ్యాంధ్ర నిర్మాత అయిన బూర్గుల 1967 సెప్టెంబర్ 14న మరణించారు.

No comments:

Post a Comment