Wednesday, October 12, 2016

ఒక్కో జిల్లాదీ.. ఒక్కో విశిష్టత



తెలంగాణలో కొత్త జిల్లాల ఆవిర్భావానికి సర్వం సిద్ధమైంది. 21 నూతన జిల్లాలతో కలిపి రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 31కి చేరింది. ఒక్కో జిల్లాదీ ఒక్కో విశిష్టత. ప్రాచీన సంస్కృతీ వైభవం, మది దోచే ప్రకృతి అందాలు, సహజసిద్ధంగా లభించిన ఖనిజ సంపదతో ప్రతీ జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల విశేషాంశాలతో ప్రత్యేక కథనం..
కాకతీయ వైభవదీప్తి

కాకతీయ సామ్రాజ్య రాజధానిగా చరిత్రపుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నగరం వరంగల్‌. పునర్విభజనతో ఇప్పుడు నగరం చుట్టుపక్కల మండలాలన్నీ కలిపి వరంగల్‌ అర్బన్‌ జిల్లాగా రూపాంతరం చెందింది. వరంగల్‌.. హైదరాబాద్‌ తరువాత రాష్ట్రంలో అతిపెద్ద నగరం. తెలంగాణ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలను అనుసంధానం చేసే ప్రధాన రైల్వే జంక్షన్‌ ఖాజీపేట ఇక్కడే ఉంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ఆసియాలోనే అతిపెద్దది.
* ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళి దేవాలయం, చరిత్రాత్మక వేయి స్తంభాలగుడి ప్రధాన ఆకర్షణలు. ఖిలా వరంగల్‌ మట్టికోట, రాతికోట కాకతీయుల కళా నైపుణ్యానికి ప్రతీక. కుష్‌మహల్‌ వీక్షకులకు ఆనందాన్ని అందిస్తుంది.
* తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత విద్యాలయాలకు చిరునామా వరంగల్‌. ఒకప్పటి ప్రాంతీయ ఇంజినీరింగ్‌ కళాశాల ఇప్పుడు నిట్‌గా మారి ఇంజినీరింగ్‌ విద్యకు పట్టుగొమ్మగా బాసిల్లుతోంది. కాకతీయ విశ్వవిద్యాలయం, కాళొజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాలు విద్యారంగంలో వరంగల్‌ ప్రతిషను పెంచుతున్నాయి.
* నైజాం కాలంనాటి మామునూరు విమానాశ్రయం ఈ జిల్లాలో ఉంది.
* ప్రధాని అయిన ఏకైక తెలుగుబిడ్డ పీవీ నర్సింహరావు స్వగ్రామం భీమదేవరపల్లి ఈ జిల్లాలోనిదే.
* రెండో పెద్ద పట్టణం: స్టేషన్‌ఘన్‌పూర్‌ (జనాభా 10,072)
* నియోజకవర్గాలు: వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, వర్థన్నపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌
* శాసనసభ్యులు: దాస్యం వినయ్‌భాస్కర్‌, కొండా సురేఖ, ఎ.రమేష్‌, టి.రాజయ్య
జై.. శంకర్‌

తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో కీలక భూమిక వహించిన ఆచార్య జయశంకర్‌ సార్‌ పేరు మీదుగా ఏర్పాటైన జిల్లా ఇది..సిరులు కురిపించే నల్లబంగారానికి నెలవు.విలువైన అటవీ సంపద, వేలమంది సింగరేణి కార్మికుల శ్రామిక శక్తికి చిరునామా. గలగలా గోదారి ప్రవహిస్తున్న ఈ జిల్లాలో తెలంగాణ వ్యవసాయానికి జీవనరేఖగా భావించే కాళేశ్వరం (మేడిగడ్డ) ప్రాజెక్టు నిర్మించబోేతున్నారు. కేటీపీపీ విద్యుత్‌కేంద్రం జిల్లాకే తలమానికం.
* రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా ఇదే.
* మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.
* చారిత్రక రామప్ప దేవాలయం, కాళేశ్వరంలో శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయాలు జిల్లాకే ప్రత్యేకం.
* గణపురంలో కోటగుళ్లు, రేగొండలో పాండవుల గుట్ట, కోటంచ నర్సింహస్వామి దేవాలయాలు, రామప్ప, లక్నవరం చెరువులు పర్యాటక కేంద్రాలు.
* ఏటూరునాగారం అతిపెద్ద ఐటీడీఏ.
* జిల్లా కేంద్రం : భూపాలపల్లి (జనాభా 70,000)
* రెండో పెద్ద పట్టణం: ములుగు (జనాభా 18,000)
* రెవిన్యూ డివిజన్లు: 2 (భూపాల్‌పల్లి, ములుగు)
* మండలాలు: 20
* మంత్రులు : చందూలాల్‌, మధుసూదనాచారి (సభాపతి)
* అసెంబ్లీ నియోజకవర్గాలు: భూపాలపలి, ములుగు
పోరాటానికి పోతుగడ్డ

తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్రంగా.. రాజకీయ, సామాజిక ఉద్యమాల పోతుగడ్డగా జనగామ పేరుగాంచింది. ఓరుగల్లు తర్వాత విద్యాకేంద్రం. జనగామ ఒకప్పుడు జైనుల ప్రాబల్యం కలిగిన ప్రాంతం. తెలంగాణలోనే అత్యధికంగా పాల ఉత్పత్తి చేసే డివిజన్‌. రోడ్డు, రైల్వేల ప్రధాన రవాణా మార్గాలు. దేవాదుల, ఎస్సారెస్పీలతోబాటు బయ్యన్న రిజర్వాయర్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ జలాశయం సాగునీరు అందిస్తున్నాయి.
* పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి. జీడికల్‌ వీరాచల శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయాలు ప్రసిద్ధిగాంచినవి.
* జిల్లాలోని పెంబర్తి లోహ హస్తకళలో ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది.
* మహాకవి బమ్మెర పోతన జన్మస్థలం బమ్మెర, కవి పాల్కురికి సోమనాధుడి స్వగ్రామం పాలకుర్తి ఈ జిల్లాలోనే ఉన్నాయి.
* దక్కన్‌ పీఠభూమిలో ఎత్తయిన ప్రాంతం సోలామైల్‌ ఇక్కడే ఉంది.
* జిల్లా కేంద్రం : జనగాం (జనాభా 52,394)
* రెండో పెద్ద పట్టణం: పాలకుర్తి (జనాభా 7,380)
* రెవిన్యూ డివిజన్లు: 2
* మండలాలు: 13
* నియోజకవర్గాలు: జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌
* ఎమ్మెల్యేలు: యాదగిరిరెడ్డి, దయాకరరావు, టి.రాజయ్య
వ్యవసాయానికి వూపిరి

కాకతీయ సామ్రాజ్యం విస్తరించిన జిల్లా. వ్యవసాయానికి ఖిల్లా. నర్సంపేట రైసుమిల్లులకు, గీసుగొండ పత్తి పరిశ్రమలకు చిరునామా. కాకతీయుల పాలనకు గుర్తుగా చారిత్రక పాకాల సరస్సు, పాకాల గుండం శివాలయం, అయినవోలు దేవస్థానం కనిపిస్తాయి.
* భీమునిపాదం జలపాతం, కొమ్మాల జాతర ప్రసిద్ధి.
* గంగదేవిపల్లి దేశానికే ఆదర్శ గ్రామ పంచాయతీ.
* రెండో పెద్ద పట్టణం: నర్సంపేట (జనాభా: 30,963)
* రెవిన్యూ డివిజన్లు: 2 (వరంగల్‌, నర్సంపేట)
* మండలాలు: 15
* నియోజకవర్గాలు: పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట
* ఎమ్మెల్యేలు: చల్లా ధర్మారెడ్డి, ఎ.రమేష్‌, మాధవరెడ్డి
మానుకోట.. గిరిజనం బాట

గిరిజనులు ఎక్కువగా ఉండే జిల్లా ఇది. మహబూబాబాద్‌ (నాటి మానుకోట)కు చారిత్రక ప్రాధాన్యం ఉంది. అటవీ సంపదకు నిలయం. రైలు, రోడ్డు మార్గాల్లో ప్రధానమైన ప్రాంతం. కురవి శ్రీవీరభద్రస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. బయ్యారంలో అపారమైన ఇనుప ఖనిజం ఉంది. అనంతారంలోని శ్రీవెంకటేశ్వరస్వామి, నర్సింహులపేటలో శ్రీవెంకటేశ్వరస్వామి, డోర్నకల్‌లో చర్చి, గూడూరులోని భీముడిపాదం సందర్శనీయ స్థలాలు, దశాబ్దాలుగా గార్లలో ఏటా దసరా రోజున జాతీయ జెండాను ఎగరవేగవేయడం ఇక్కడి ప్రత్యేకత.
* అటవీ విస్తీర్ణం: 1,31,530 హెక్టార్లు
* రెండో పెద్ద పట్టణం: తొర్రూరు (జనాభా 19,000)
* రెవిన్యూ డివిజన్లు: 2 (మహబూబాబాద్‌, తొర్రూరు)
* మండలాలు: 16
* నియోజకవర్గాలు: మహబూబాబాద్‌
* డోర్నకల్‌ ఎమ్మెల్యేలు: శంకర్‌నాయక్‌, రెడ్యానాయక్‌
పత్తికి, ప్రకృతికి పట్టుగొమ్మ

గిరిజన సంస్కృతికి ఆలవాలం.. ప్రకృతి అందాల నిలయం ఆదిలాబాద్‌. ఆదిల్షా అనే రాజు పరిపాలించడంతో ఈ ప్రాంతానికి ఆదిలాబాద్‌ అనే పేరు వచ్చింది. ఆదిలాబాద్‌నే ఎదులాపురం అని కూడా అంటారు. ఈ జిల్లాలో పత్తి విస్తారంగా పండిస్తారు. సాత్నాలా ప్రాజెక్టు, మత్తడివాగు ప్రాజెక్టులు నీటివనరులు. కాటన్‌ స్పిన్నింగ్‌మిల్లు ఉంది. విస్తారమైన అటవీ ప్రాంతం.. గోదావరి గలగలలు ఈ ప్రాంతం సొంతం.
* బోథ్‌ నియోజకవర్గంలోని పొచ్చర, గాయత్రి, కనకాయి జలపాతాలు ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
* ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా దేవాలయం ఆదివాసీలకు ఆరాధ్య దైవంగా విరాజిల్లుతోంది. సత్యనారాయణస్వామి ఆలయం ప్రాచీన ప్రాశస్త్యం కలిగి ఉంది.
* రెండో పెద్ద పట్టణం: ఉట్నూరు (జనాభా: 63,465)
* రెవెన్యూ డివిజన్లు: 2 (ఆదిలాబాద్‌, ఉట్నూరు)
* మండలాలు: 18
* అటవీ విస్తీర్ణం: 1,09,007,హెక్టార్లు.
* మంత్రులు : జోగు రామన్న
* అసెంబ్లీ నియోజకవర్గాలు: ఆదిలాబాద్‌, బోథ్‌తో ఖానాపూర్‌లో కొంతభాగం
* శాసనసభ్యులు: రేఖానాయక్‌, రాథోడ్‌ బాబూరావు
జ్ఞానసరస్వతి కొలువు

బాసర జ్ఞానసరస్వతీ దేవి కొలువైన జిల్లా నిర్మల్‌. తూర్పున అడవులు, పడమర బాసర క్షేత్రం, ఉత్తరాన సహ్యాద్రి పర్వతాలు, దక్షిణాన గోదావరి నది నడుమ ఈ జిల్లా రూపుదిద్దుకుంది. పెయింటింగ్‌లు, కొయ్యబొమ్మలకు ప్రపంచఖ్యాతి పొందిన నిర్మల్‌ ఒకప్పుడు నిజాం ఆయుధాల తయారీ కేంద్రం. వ్యవసాయమే ఇక్కడి ప్రజల ప్రధాన వ్యాపకం.
* 400 ఏళ్ల క్రితం నిమ్మనాయుడు పాలించడంతో ఆయన పేరుపై వెలిసిందే నిర్మల్‌. ఈ చారిత్రక పట్టణం కవులు, కళాకారులకు పుట్టినిల్లు.
* బాసర, పాపేశ్వర ఆలయం, అడెల్లి మహాపోచమ్మ ఆలయాలు ఉన్నాయి.
* స్వర్ణ, గడ్డెన్నవాగు, కడెం జలాశయాలతో పాటు సదర్మాట్‌ బ్యారేజీ తాగు, నీటి అవసరాలు తీరుస్తున్నాయి.
* రెవెన్యూ డివిజన్లు: 2(నిర్మల్‌, భైంసా)
* ప్రధాన పట్టణాలు: నిర్మల్‌, భైంసా
* విస్తీర్ణం: 3,845 చ.కి.మీ
* అటవీ విస్తీర్ణం: 1,17,022 హెక్టార్లు
* మండలాలు: 19
* మంత్రి: ఇంద్రకరణ్‌రెడ్డి
* అసెంబ్లీ నియోజకవర్గాలు: నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌
* శాసనసభ్యులు: ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌
ప్రాణహితతో పునీతం

గోదావరి, ప్రాణహిత జలాలతో పునీతమవుతున్న జిల్లా మంచిర్యాల. అపారమైన బొగ్గు నిక్షేపాలతో సింగరేణికి వూపిరులూదుతోంది. సిమెంటు పరిశ్రమలు ఈ జిల్లా ప్రత్యేకం. జైపూర్‌ మండలంలో 1,200 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం తెలంగాణకు వెలుగురేఖ. గోదావరి నదిపై ఎల్లంపల్లి (శ్రీపాదసాగర్‌) జలాశయం వేల గ్రామాలకు తాగు, సాగునీరు అందిస్తోంది. హైదరాబాద్‌ దాహార్తి తీరుస్తోంది.
* మందమర్రి మండలంలో గాంధారి ఖిలా, గాంధారి వనం, జైపూర్‌ మండలంలో మొసళ్ల అభయారణ్యం, కోటపల్లి మండలంలో కృష్ణజింకల అభయాణ్యం, జన్నారం మండలంలో పులుల అభయారణ్యాం ప్రత్యేక పర్యాటక ఆకర్షణలు.
* గూడెంలో శ్రీసత్యనారాయణ ఆలయాన్ని రెండో అన్నవరంగా పిలిస్తారు. ఎల్లంపల్లితో పాటు ర్యాలీవాగు, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టులు ఉన్నాయి.
కుమురంభీం పోరుగడ్డ

పోరాటయోధుడు కొమురం భీం పోరుసల్పిన జోడేఘాట్‌, ప్రకృతి రమణీయత అలరారే ప్రాంతాలు, గిరిజనుల ఆరాధ్య దైవాలు కొలువుదీరిన ప్రాంతాలు నేటి ఆసిఫాబాద్‌ జిల్లా సొంతం. నేటి జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌ ఒకప్పటి గోండుల రాజధాని. ఏడు దశాబ్దాల క్రితమే జిల్లా కేంద్రం. జోడేఘాట్‌తోబాటు జైనూరులోని మార్లవాయి హేమండార్ఫ్‌ దంపతుల స్మారక స్థలం, సప్తగుండాల జలపాతం, సముతుల గుండం జలపాతాలు ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు.
* కెరమెరి మండలంలోని జంగుబాయి దేవత శంకర్‌లొద్ది, తిర్యాణి మండలంలోని అర్జున్‌లొద్ది గుహలు గిరిజనుల ఆధ్యాత్మిక క్షేత్రాలు. వాంకిడిలోని కాకతీయుల నాటి శివాలయం, ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
* కుమురం భీం ప్రాజెక్టు, వట్టివాగు, ఎన్టీఆర్‌సాగర్‌, జగన్నాథ్‌పూర్‌, పాల్వాయిసాగర్‌ జలాశయాలు ఈ జిల్లాలో ముఖ్యమైనవి.
* దశాబ్దాలుగా కాగితాన్ని అందించిన కాగజ్‌నగర్‌లోని పేపర్‌మిల్లు ఇక్కడే ఉంది. ఆసిఫాబాద్‌ జిన్నింగ్‌ మిల్లులకు నిలయం.
* రెండో పెద్ద పట్టణం: కాగజ్‌నగర్‌ (జనాభా 1,09,085)
* విస్తీర్ణం : 4,878 చ.కి.మీ
* రెవిన్యూ డివిజన్లు: 2 (ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌)
* మండలాలు : 15
* అసెంబ్లీ నియోజకవర్గాలు: ఆసిఫాబాద్‌, సిర్పూరు
* ఎమ్మెల్యేలు : కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి

 జనాభా వివరాలు 2011 జనాభా లెక్కల ప్రకారం
ఉద్యమాల ఖిల్లా

విప్లవ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పురుడు పోసుకున్న గడ్డ నల్గొండ జిల్లా. నల్గొండ కేంద్రంగా 1907లోనే ఈ జిల్లా ఏర్పడింది. ఫార్మా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. కృష్ణానదీ పరివాహక ప్రాంతమైన మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల వద్ద పెద్ద సంఖ్యలో సిమెంటు పరిశ్రమలున్నాయి. నాలుగువేల మెగావాట్ల యాదాద్రి విద్యుత్‌ కేంద్రం ఇక్కడే రానుంది.
* ఆధునిక దేవాలయంగా ప్రసిద్ధిగాంచి, తెలుగు రాష్ట్రాల వ్యవసాయానికి ఆయువుపట్టయిన నాగార్జునసాగర్‌ ఇక్కడే ఉంది. జలవిద్యుత్‌ వెలుగులతోనూ దేదీప్యమానం చేస్తోంది. మూసీ ప్రాజెక్టు కూడా సాగునీరు అందిస్తోంది.
* మునుగోడు, దేవరకొండ నియోజకవర్గంలో చేనేత పరిశ్రమ అనేక మందికి ఉపాధి మార్గం.
* నాగార్జునసాగర్‌, చందంపేట గుహలు, దేవరకొండ కోట, సాగర్‌ వెనుక జలాల్లోని ఏలేశ్వరం ప్రాంతంలోని మల్లన్నస్వామి ఆలయం ప్రధానమైన పర్యటక ప్రాంతాలు.
* అటవీ విస్తీర్ణం : 20,317 హెక్టార్లు
* జిల్లా కేంద్రం : నల్గొండ (జనాభా 1,65,452)
* రెండో పెద్ద పట్టణం : మిర్యాలగూడ (జనాభా 1,09,000)
* రెవెన్యూ డివిజన్లు : 3 (నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ)
* మండలాలు : 31
* రెవెన్యూ గ్రామాలు: 565
అసెంబ్లీ నియోజకవర్గాలు
* నాగార్జునసాగర్‌, నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడతోపాటు మునుగోడు, నకిరేకల్‌ నియోజకవర్గాలు పాక్షికంగా.
* ఎమ్మెల్యేలు : కె.జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రవీందర్‌నాయక్‌, భాస్కరరావు.
నరసింహుడి నీడన

నిజాం సంస్థానంలో స్వాతంత్రోద్యమానికి నాంది పలికిన ఆంధ్ర మహాసభలు పురుడు పోసుకుంది ఈ ప్రాంతంలోనే. కొలనుపాక జైనదేవాలయం చారిత్రక ప్రాధాన్యం కలిగింది. ఏకశిలపై వెయ్యేళ్ల క్రితం నిర్మించిన భువనగిరి కోట చూడదగ్గ ప్రదేశం. ఇప్పటికే ఇక్కడ రాక్‌క్లైంబింగ్‌ ద్వారా అనేక మందికి శిక్షణనిస్తున్నారు. తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఈ జిల్లాలోనే ఉంది.
* అటవీ విస్తీర్ణం: 12,628 హెక్టార్లు
* జిల్లా కేంద్రం: భువనగిరి (జనాభా 55,545)
* రెండోపట్టణం: చౌటుప్పల్‌ (జనాభా 25,000)
* ఇతర పట్టణాలు : చౌటుప్పల్‌, ఆలేరు, యాదగిరిగుట్ట
* రెవెన్యూ డివిజన్లు: 2 (భువనగిరి, చౌటుప్పల్‌)
* మండలాలు: 16
* నియోజకవర్గాలు: భువనగిరి, ఆలేరు
* ఎమ్మెల్యేలు: పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగడి సునీతరెడ్డి
* పోచంపల్లి చేనేత కేంద్రంగా ప్రసిద్ధికెక్కింది.
* బీబీనగర్‌, భువనగిరిల్లో మ్యానుఫ్యాక్చరింగ్‌ పరిశ్రమలు స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నాయి.
* భూదానోద్యామానికి బీజం వేసిన భూదాన్‌పోచంపల్లి జిల్లాలోనిదే.
విశ్వయవనికపై విజయ పతాక

చారిత్రక, సాంస్కృతిక, సంప్రదాయ జీవన ప్రతీక.. ప్రపంచ ఐటీ రంగ యవనిక హైదరాబాద్‌. ఎంతటి అంతర్జాతీయ సంస్థ అయినా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే హైదరాబాద్‌ వైపు చూస్తుందంటే అతిశయోక్తి కాదు. పుష్కలమైన మానవవనరులు, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. గోల్కొండ నవాబు మహ్మద్‌కులీ కుతుబ్‌షా 1590లో హైదరాబాద్‌కు పునాది వేశారు. 425 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భాగ్యనగరం ఖ్యాతి ఏటా పెరుగుతూనే ఉంది. ఏడో నిజాం.. ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో హైదరాబాద్‌ విలువ ప్రపంచ దేశాలకు తెలిసింది. 1978 వరకు హైదరాబాద్‌ అతి పెద్ద జిల్లాగా ఉండేది. ఆ తరువాత హైదరాబాద్‌ నుంచి కొన్ని ప్రాంతాలను విడగొట్టి రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఎలాంటి మార్పుల్లేవు.
* ఇండో- అరబిక్‌- పర్షియన్‌ వాస్తు శిల్ప కళానైపుణ్యానికి హైదరాబాద్‌ కట్టడాలు ప్రతీక. ఒక్కో కట్టడానిది ఒక్కో చారిత్రక నేపథ్యం. ప్రపంచంలో ఎక్కడా లేని నిర్మాణశైలి వీటి సొంతం.
* గోల్కొండ కోట, చార్మినార్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, అసెంబ్లీ, చౌమొహల్లా ప్యాలెస్‌, కింగ్‌కోఠి, పురానీ హవేలీ, ఫలక్‌నుమా ప్యాలెస్‌ కట్టడాలు చరిత్రకు సజీవసాక్ష్యాలు.
* మక్కా మసీదు, లాల్‌దర్వాజా, ఉజ్జయిని మహంకాళి దేవాలయాలు పండగలకు ప్రధాన ఆకర్షణ.
* ప్రపంచ స్థాయి విద్యా, వైద్య కేంద్రంగా ప్రఖ్యాతి.
* ఐటీ రంగంలో విశ్వవిఖ్యాత నగరం.
* రెవెన్యూ డివిజన్లు: 2 (హైదరాబాద్‌, సికింద్రాబాద్‌)
* మండలాలు : 16
* మంత్రులు : మహమూద్‌ అలీ, నాయిని నరసింహారెడ్డి, పద్మారావుగౌడ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
అసెంబ్లీ నియోజకవర్గాలు
ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, నాంపల్లి, గోషామహల్‌, అంబర్‌పేట, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, మలక్‌పేట్‌, కార్వాన్‌, చార్మినార్‌, బహుదూర్‌పురా, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట
శాసనసభ్యులు
చింతల రామచంద్రారెడ్డి, మాగంటి గోపీనాథ్‌, జాఫర్‌ హుస్సేన్‌, రాజాసింగ్‌ లోథ్‌, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్‌, అహ్మద్‌బిన్‌ అబ్దుల్లా, కౌసర్‌ మొహియుద్దీన్‌, అహ్మద్‌ పాషా ఖాద్రీ, మహ్మద్‌ మొజంఖాన్‌, ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌, అక్బరుద్దీన్‌ ఒవైసీ.
కృష్ణా, తుంగభద్రల నడిగడ్డ

తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక సంప్రదాయాలు, సంస్కృతుల కలగలిసిన జిల్లా గద్వాల. కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో విస్తరించి నడిగడ్డగా పేరొందింది.
* అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవదైన జోగులాంబ క్షేత్రం కొలువైన అలంపూర్‌ ఈ జిల్లాలోనే కొలువైంది. బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం ఖ్యాతి పొందింది.
* గద్వాల సంస్థానానికి ఎంతో ప్రాభవముంది. గద్వాల చేనేత చీరల ఖ్యాతి జగద్విదితం.
* కృష్ణా నదిపై తెలంగాణలో మొదటి ప్రాజెక్టు అయిన జూరాల ప్రాజెక్టు ధరూరు మండలంలో ఉంది. నెట్టెంపాడు, జూరాల సాగునీరు, అందుతున్నాయి. జూరాల జలవిద్యుత్‌ కేంద్రంలో ఏటా 200 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తవుతోంది.
* జిల్లా కేంద్రం: గద్వాల (జనాభా 63,177)
* రెండో పెద్ద పట్టణం: అలంపూర్‌ (జనాభా 35,021)
* రెవెన్యూ డివిజన్లు: 1 (గద్వాల)
* మండలాలు: 12
* అసెంబ్లీ నియోజకవర్గాలు: గద్వాల, ఆలంపూర్‌
* శాసనసభ్యులు: డి.కె.అరుణ, సంపత్‌కుమార్‌
నల్లమల అందాల నాగర్‌కర్నూలు

నల్లమల అటవీ ప్రాంతం.. నాగార్జునసాగర్‌ పులుల అభయారణ్యం, కృష్ణానది పరవళ్లు నాగర్‌కర్నూలు జిల్లా ప్రత్యేకత. తెలంగాణ సాగునీటి రంగంలో కీలకమైన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, శ్రీశైలం వెనుక జలాలను ఎత్తిపోత ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, శ్రీశైలం ఎడమ కాల్వ సొరంగం ఈ జిల్లాలోనే ఉన్నాయి. కల్వకుర్తి సమీపంలో కాటన్‌ పరిశ్రమ 700 మందికి ఉపాధిని ఇస్తోంది.
* జిల్లా కేంద్రం: నాగర్‌కర్నూలు (జనాభా 42,000)
* రెండో పెద్ద పట్టణం: కల్వకుర్తి (జనాభా 66,388)
* రెవెన్యూ డివిజన్లు: 3 (నాగర్‌కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట)
* అటవీ విస్తీర్ణం: 85వేల హెక్టార్లు
* మండలాలు: 20
* రెవెన్యూ గ్రామాలు: 362
* మంత్రి: జూపల్లి కృష్ణారావు
* ఇతర ప్రధాన పట్టణాలు: కల్వకుర్తి. అచ్చంపేట, కొల్లాపూర్‌
* అసెంబ్లీ నియోజకవర్గాలు: అచ్చంపేట, నాగర్‌కర్నూలుతోపాటు కల్వకుర్తి, కొల్లాపూర్‌ పాక్షికంగా ఉన్నాయి.
* శాసనసభ్యులు: మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, వంశీచంద్‌రెడ్డి
* వందేళ్ల క్రితమే జిల్లాగా ఉన్న నాగర్‌కర్నూలు ఇప్పుడు మళ్లీ జిల్లాగా మారింది. 1794-1904 కాలంలోనూ నాగర్‌కర్నూలు జిల్లాగా బాసిల్లింది. మహబూబ్‌నగర్‌కు రైల్వే లైను నిర్మాణం పూర్తికావడంతో రవాణా సౌకర్యం కోసం 112 ఏళ్ల క్రితం నైజాం నవాబులు నాగర్‌కర్నూలు నుంచి రాజధానిని మార్చారు.
* పొడవైన కృష్ణాతీరం, సోమశిల అందాలు, నల్లమల అభయారణ్యం జిల్లా సిగలో ఆణిముత్యాలు.
* నల్లమలలోని ఉమమహేశ్వరస్వామి దేవాలయం, వట్టెం వెంకటేశ్వరస్వామి దేవాలయం, కొల్లాపూర్‌ మండలం సోమశిలలో సోమేశ్వరలయాలు ప్రసిద్ధి చెందినవి.
* సోమశిల వద్ద సప్తనదుల సంగమం, మల్లెల తీర్థం జలపాతం, నల్లమలలోని పరహాబాద్‌ వ్యూపాయింట్‌ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. సోమశిల నుంచి శ్రీశైలం వరకు నదిలో పడవ ప్రయాణం ఆహ్లాదాన్ని పంచుతోంది.
నిజాం సాగర్‌ గలగలలు

నిజాం హయాంలో కేవలం ఏడేళ్లలో పూర్తిచేసిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు కామారెడ్డి జిల్లాలో ఉంది. హైదరాబాద్‌ నగరానికి 110 కి.మీ దూరంలోని కామారెడ్డిలో జాతీయ రహదారి, రైల్వేలైను ఉన్నాయి. మెదక్‌, సిరిసిల్ల, నిజామాబాద్‌, సిద్దిపేట జిల్లాలకు కూడలి. తెలంగాణలో బెల్లం ఉత్పత్తి చేసే ఏకైక ప్రాంతమిది. బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ కళాశాలా ఇక్కడే ఉంది.
* జిల్లా కేంద్రం: కామారెడ్డి(జనాభా 80,378)
* రెండో పెద్దపట్టణం: బాన్సువాడ(జనాభా 45,000)
* రెవెన్యూ డివిజన్లు: కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి
* మండలాలు: 20
* మంత్రి: పోచారం శ్రీనివాస్‌రెడ్డి
* నియోజకవర్గాలు: కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌
* ఎమ్మెల్యేలు: గంప గోవర్ధన్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంతుషిండే.
* భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం, కాల భైరవస్వామి, లక్ష్మీనరసింహస్వామి, బుగ్గరామలింగేశ్వర, బసవేశ్వర ఆలయాలు.. నిజాంసాగర్‌, పోచారం, కౌలాస్‌నాలా ప్రాజెక్టు, దోమకొండ సంస్థానం కోట, పోచారం ప్రాజెక్టు, పోచారం అభయారణ్యం పర్యటక ప్రాంతాలు.
* గాయత్రి, మాగి చక్కెర కర్మగారాలు ప్రధానమైనవి.
విద్యాక్షేత్రం వనపర్తి

సంస్థానాల చరిత్రలో ప్రత్యేకమైన స్థానం పొందిన జిల్లా వనపర్తి. 1870 కాలంలో పరిపాలన సాగించిన సంస్థాధీశుల వనపర్తి కోట ప్రాముఖ్యం గాంచింది. చదువుల ఖిల్లాగా పేరున్న వనపర్తి ప్రాంతం ప్రస్తుతం జిల్లాగా ఆవిర్భవించింది. హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో పెబ్బేరు మండలంలోని శ్రీరంగాపురం రంగనాయకస్వామి ఆలయం ప్రసిద్ధి.
* రామన్‌పాడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ తాగునీటికి, సాగునీటికి ప్రధానంగా ఉంది. ఆత్మకూరు మండలంపరిధిలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమకాల్వ జిల్లాకు గుండెకాయవంటిది. భీమా రెండో విడత ఎత్తిపోతల పథకం కింద శంకరసముద్రం జలాశయం నిర్మాణంలో ఉంది.
* కొత్తకోటలో కృష్ణవేణి ప్రైవేటు చక్కెర పరిశ్రమ, పెబ్బేరులో సస్తా మొలాసిస్‌ పరిశ్రమలు ఉన్నాయి.
* జిల్లా కేంద్రం: వనపర్తి (జనాభా 80,000)
* మండలాలు: 14
* రెండో పెద్ద పట్టణం: పెబ్బేరు (జనాభా 68,690)
* ఎమ్మెల్యేలు: జి.చిన్నారెడ్డి
* అసెంబ్లీ నియోజకవర్గాలు: వనపర్తి పూర్తిగా.. దేవరకద్ర, మక్తల్‌, కొల్లాపూర్‌ నియోజకవర్గాలు పాక్షికంగా
సిమెంటు పరిశ్రమల కేంద్రం

రజాకార్ల వ్యతిరేక తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ కేంద్రం సూర్యాపేట. సిమెంట్‌ పరిశ్రమలతో అలరారుతోంది. ఇతర పరిశ్రమలు తక్కువైనా వ్యవసాయంలో మిన్నగా ఉంది. కృష్ణా పరివాహక ప్రాంతం కావడంతోపాటు సాగర్‌ ఎడమకాల్వ వ్యవసాయానికి ప్రధాన నీటివనరు.
* పురాతన కాకతీయ కాలంనాటి శివాలయాలతో అలరారుతూ చారిత్రక ప్రాధాన్యాన్ని చాటుకుంటోంది.
* పిల్లలమర్రిలోని వెయ్యేళ్ల నాటి చెన్నకేశవ ఆలయం జిల్లాకు ప్రత్యేకత.
* అటవీ విస్తీర్ణం: 11,623 హెక్టార్లు
* జిల్లా కేంద్రం: సూర్యాపేట (జనాభా 1,05,400)
* రెండో పెద్ద పట్టణం : కోదాడ (జనాభా 56,000)
* రెవెన్యూ డివిజన్లు: 2 (సూర్యాపేట, కోదాడ (కొత్తది)
* మండలాలు: 23
* మంత్రి: జగదీశ్‌రెడ్డి
పాలమూరు కొత్త తీరు

పాల ఉత్పత్తికి పేరుగాంచి పాలమూరుగా వినుతికెక్కిన జిల్లా. నిజాం పాలన తర్వాత దీనికి మహబూబ్‌నగర్‌గా నామకరణం చేశారు. నిజాం కాలంలోనే పాలమూరు మీదుగా రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. దేవరకద్ర మండలంలో కోయిల్‌సాగర్‌ జలాశయం ప్రధాన సాగునీటి వనరు.
* మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో పిల్లలమర్రి ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. 700 ఏళ్లు చరిత్ర ఉన్న ఈ మర్రిచెట్టు మూడెకరాల్లో విస్తరించి ఉంది. పర్యాటక శాఖ ప్రదర్శనశాల, వస్తుప్రదర్శనశాల కూడా ఉన్నాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పురాతన ఆలయాల విగ్రహాలు ఇక్కడ భద్రపరిచారు.
* పేదల తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన మన్యంకొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది.
* జిల్లా కేంద్రం: మహబూబ్‌నగర్‌ (జనాభా 2,15,205)
* రెండో పెద్ద పట్టణం: జడ్చర్ల (జనాభా 1,04,141)
* రెవెన్యూ డివిజన్లు: 2 (మహబూబ్‌నగర్‌, నారాయణపేట)
* మండలాలు: 26
* మంత్రి: సిహెచ్‌.లక్ష్మారెడ్డి
* అసెంబ్లీ నియోజకవర్గాలు: మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్‌
* ఎమ్మెల్యేలు: వి.శ్రీనివాస్‌గౌడ్‌, ఎస్‌.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి
గోదావరితో సస్యశ్యామలం..

ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిజామాబాద్‌ జిల్లాలోనే ఉంది. గోదావరిపై కట్టిన ప్రాజెక్టులతో జిల్లా సస్యశ్యామలమవుతోంది. వేలాదిమందికి ఉపాధి కల్పించిన బోధన్‌లోని నిజాం చక్కెర కర్మాగారం, సారంగాపూర్‌ సహకార చక్కెర కర్మాగారాలు ప్రస్తుతం మూతపడ్డాయి. పసుపు సాగుకు నిజామాబాద్‌ జిల్లా పెట్టింది పేరు. సికింద్రాబాద్‌-ముంబయి రైల్వేలైను ఉంది.
బ్రిటిష్‌ కాలం నాటి రుద్రూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం జిల్లాకే తలమానికం. వైద్య కళాశాలతో పాటు ఆసుపత్రి ఉంది. బడా పహాడ్‌దర్గా, ఖిల్లా జైలు, సిర్నాపల్లి గడీ, సారంగాపూర్‌ హనుమాన్‌ దేవాలయం, డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం, దేవల్‌మజీద్‌, కందకుర్తి త్రివేణి సంగమం, రామడుగు జలాశయం, గుత్ప ఎత్తిపోతల పథకాలు, అలీసాగర్‌, అశోక్‌సాగర్‌, జానకంపేట అష్టముఖి కోనేరు, బోధన్‌ భీమునిగుట్టలు ప్రముఖ పర్యాటక కేంద్రాలు. నిజామాబాద్‌ను ఇందూరుగా పిలుస్తారు.
* నియోజకవర్గాలు: నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూరు, బాల్కొండ, బోధన్‌
* ఎమ్మెల్యేలు: బిగాల గణేష్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, షకీల్‌
సాగులో మేటి.. అభివృద్ధిలో పోటీ..

అభివృద్ధికి మచ్చుతునక ఖమ్మం జిల్లా.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ జిల్లా వ్యవసాయంలో అగ్రగామిగా ఉంది. జిల్లాలో దొరికే గ్రానైట్‌ విదేశాలకు ఎగుమతి అవుతుంది. నేలకొండపల్లి, కల్లూరులో రెండు చక్కర కర్మాగారాలు, రైస్‌మిల్లులు ఉన్నాయి. సాగర్‌ ఎడమ కాలువ జిల్లా పరిధిలో ఉంటుంది. వైరా, లంకాసాగర్‌ ప్రాజెక్టులున్నాయి.
* సత్తుపల్లిలో ఉపరితల బొగ్గు గని ఉంది.
* నేలకొండపల్లిలో బౌద్ధస్తూపం, భక్తరామదాసు నివాసం.
* ఖమ్మంలో స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం స్వయంభూగా విరాజిల్లుతోంది. నగరంలోని ఖిల్లా అత్యంత పురాతనమైంది.
* జిల్లా కేంద్రం: ఖమ్మం (జనాభా 3,10,000)
* రెండో పెద్దపట్టణం: సత్తుపల్లి (జనాభా 77043)
* రెవెన్యూ డివిజన్లు: ఖమ్మం, కల్లూరు
* మండలాలు: 21
* పట్టణాలు: 3
* మంత్రి: తుమ్మల నాగేశ్వరరావు
* నియోజకవర్గాలు: ఖమ్మం, ఇల్లెందు, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి
* ఎమ్మెల్యేలు: పువ్వాడ అజయ్‌కుమార్‌, భట్టివిక్రమార్క, బానోతుమదన్‌లాల్‌, సండ్ర వెంకటవీరయ్య, కోరం కనకయ్య.
ఏడుపాయలు.. మంజీరా గలగలలు

మెదక్‌లో జిల్లా కేంద్రం కావాలన్న కొన్నేళ్ల కల నెరవేరింది. హైదరాబాద్‌కు దగ్గర్లో.. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా మెదక్‌. నిజాం కాలంలో నిర్మించిన ఘనపూర్‌ ఆనకట్ట జిల్లాలో సాగునీటికి ఏకైక ఆధారం.
* తూప్రాన్‌, చిన్నశంకరంపేట, చేగుంట మండలాల పరిధిలో దాణా, విత్తన తయారీ పరిశ్రమలున్నాయి. ఏడుపాయల వనదుర్గా జాతర జిల్లాలో ప్రముఖమైనది. ఇక్కడ మంజీరా నది ఏడుపాయలుగా చీలి ప్రవహిస్తుంది.
* మెదక్‌ చర్చి, ఖిల్లా, కొల్చారం మండలంలోని జైనమందిరం, నర్సాపూర్‌ అడవులు, పోచారం అభయారణ్యం ప్రధాన పర్యాటక ప్రాంతాలు.
* జిల్లా కేంద్రం: మెదక్‌(జనాభా 44,410)
* రెండో పెద్దపట్టణం: నర్సాపూర్‌(జనాభా 18,348)
* రెవెన్యూ డివిజన్లు: మెదక్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌
* మండలాలు: 20
* నియోజకవర్గాలు: మెదక్‌, నర్సాపూర్‌
* ఎమ్మెల్యేలు: పద్మాదేవేందర్‌రెడ్డి (శాసనసభ ఉపసభాపతి), మదన్‌రెడ్డి
ఐటీకి చిరునామా

రాష్ట్రానికి తలమానికమైన ఐటీ పరిశ్రమ కేంద్రీకృతమైన జిల్లా రంగారెడ్డి. ప్రపంచ స్థాయి ఐటీ సంస్థల దన్నుతో లక్షల మందికి నాణ్యమైన ఉపాధి కల్పిస్తోందీ పరిశ్రమ. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వైమానిక రంగంలో ఉపాధి అవకాశాలను సృష్టించింది. రక్షణ, ఏరోస్పేస్‌ పరిశ్రమలకు ఈ జిల్లా కేంద్రంగా మారనుంది. హైదరాబాద్‌ చుట్టూ స్తిరాస్థి రంగానికి రంగారెడ్డి జిల్లానే చిరునామా.
* నిజాం కాలంలో మూసీ, ఈసీ నదులపై నిర్మితమైన తాగునీటి తటాకాలు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట) ప్రధాన ఆకర్షణ.
* వ్యవసాయ పరిశోధన సంస్థలు, ఇంజినీరింగ్‌ కళాశాలలు, వైద్య విద్యాసంస్థలకు నెలవు.
* రెండో తిరుపతిగా పేరొందిన చిల్కూరు బాలాజీ, నర్కూడలోని అమ్మపల్లి దేవాలయాలు ప్రధాన ఆలయాలు. సినిమా చిత్రీకరణలకు అమ్మపల్లి ఆలయం పేరుగాంచింది. శంషాబాద్‌లోని ముచ్చింతల్‌లో చిన్నజీయర్‌ స్వామి ఆశ్రమం ఉంది.
* జిల్లా కేంద్రం: రాజేంద్రనగర్‌ (జనాభా 4,50,000)
* రెండో పెద్ద పట్టణం: సరూర్‌నగర్‌ (1,00,000)
* రెవెన్యూ డివిజన్లు: 5 (రాజేంద్రనగర్‌, చేవెళ్ల, కందుకూర్‌, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌)
* మండలాలు : 27
* రెవెన్యూ గ్రామాలు: 594
* పట్టణాలు, నగరాలు: సరూర్‌నగర్‌, షాద్‌నగర్‌, కొత్తూరు, శంషాబాద్‌
* నియోజకవర్గాలు: ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, చేవెళ్ల, షాద్‌నగర్‌, ఎల్‌బీనగర్‌
* ఎమ్మెల్యేలు: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ప్రకాష్‌గౌడ్‌, ఆరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, అంజయ్య యాదవ్‌, ఆర్‌.కృష్ణయ్య
ప్రగతి పరుగుల సిద్దిపేట..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వగ్రామమైన చింతమడక సిద్దిపేట మండలంలోనే ఉంది. సిద్దిపేట వాణిజ్య కేంద్రంగా పేరొందింది. కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఎక్కువ మండలాలు సిద్దిపేట జిల్లాలోనే ఉన్నాయి.
* కొమురవెల్లిమల్లన్న, వర్గల్‌ సరస్వతీ క్షేత్రం, నాచారం లక్ష్మీనరసింహస్వామి ఆలయం, జగదేవ్‌పూర్‌ వరదరాజుస్వామి, కొండపోచమ్మ, ములుగులోని పాండురంగ ఆశ్రమం ప్రసిద్ధి చెందినవి.
* ములుగులో ఉద్యాన విశ్వవిద్యాలయం, అటవీ కళాశాల విద్యాకేంద్రాలుగా ఉన్నాయి. కర్కపట్ల పారిశ్రామిక పార్కు అదనపు బలం. సిద్దిపేటలోని కోటి లింగేశ్వర ఆలయం, కోమటి చెరువు పర్యాటక కేంద్రాలు.
* జిల్లా కేంద్రం: సిద్దిపేట(జనాభా 1,14,091)
* రెండో పెద్దపట్టణం: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌(జనాభా 37,591)
* రెవెన్యూ డివిజన్లు: సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌
* మండలాలు: 22
* నియోజకవర్గాలు: సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌
* ఎమ్మెల్యేలు: రామలింగారెడ్డి, సతీశ్‌ మంత్రి: హరీశ్‌రావు
ప్రాచీన నాగరికతకు ఆలవాలం

జగ్గదేవుడి పేరిట జగిత్యాల పేరు వచ్చింది. గోదావరి నది ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, రాయికల్‌, సారంగాపూర్‌, ధర్మపురి, వెల్గటూర్‌ మండలాల మీదుగా ప్రవహిస్తోంది. ఇక్కడి పొలాసలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉత్తర తెలంగాణ జిల్లాలకు సేవలందిస్తోంది. క్రీస్తు పూర్వమే తెలంగాణలోని గోదావరి నదీపరివాహక ప్రాంతంలో నాగరికత వర్ధిల్లిందనడానికి కీలకమైన ఆధారం కోటిలింగాల పట్టణం.
* ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాలు ప్రధాన పర్యటక కేంద్రాలు.
* ముత్యంపేట చక్కెర కర్మాగారం ప్రధాన పరిశ్రమ.
* జిల్లా కేంద్రం: జగిత్యాల(జనాభా 1,03,962)
* రెండో పెద్దపట్టణం: కోరుట్ల(జనాభా 1,08,297)
* రెవెన్యూ డివిజన్లు: జగిత్యాల, మెట్‌పల్లి (కొత్తది)
* మండలాలు: 18
* నియోజకవర్గాలు: జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ
* ఎమ్మెల్యేలు: తాటిపర్తి జీవన్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, చెన్నమనేని రమేశ్‌బాబు
అనంతగిరి ఆలంబనగా..

హైదరాబాద్‌ నగరానికి తాగునీటి అవసరాలు తీర్చిన మూసీ పుట్టిన అనంతగిరి కొండలు ఈ జిల్లాలోనే ఉన్నాయి. 41 వేల హెక్టార్ల అటవీ ప్రాంతం చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం పర్యటకుల్ని కట్టిపడేస్తుంది. ఈ కొండల్లోనే పద్మనాభుడు కొలువుదీరాడు. బుగ్గరామేశ్వరం, భూకైలాస్‌, ఏకాంబరేశ్వర, జుంటుపల్లి రాముడు, కొండంగల్‌ వెంకటేశ్వరస్వామి దేవాలయాలు ఉన్నాయి. జిల్లాలోని కోటిపల్లి, లక్నాపూర్‌, సర్పన్‌పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టులు సాగునీటి అవసరాలు తీర్చుతున్నాయి.
* ప్రధాన పట్టణమైన తాండూరులో మూడు సిమెంటు కర్మాగారాలు దాదాపు 10 వేల మందికి ఉపాధి చూపుతున్నాయి.
* కంది పంటకూ తాండూరు ప్రసిద్ధి. నాపరాళ్లు, సుద్ద, ల్యాటరైట్‌ గనులున్నాయి. వీటిలో 8 వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు.
* జిల్లా కేంద్రం: వికారాబాద్‌ (జనాభా 55,000)
* రెండో పట్టణం: తాండూర్‌ (జనాభా 65,250)
* రెవెన్యూ డివిజన్లు: 2 వికారాబాద్‌, తాండూర్‌
* మండలాలు: 18
* మంత్రులు: పట్నం మహేందర్‌రెడ్డి
* నియోజకవర్గాలు: తాండూరు, పరిగి, వికారాబాద్‌
* ఎమ్మెల్యేలు: పట్నం మహేందర్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, బి.సంజీవరావు
నేతన్నల ‘రాజన్న’

అగ్గిపెట్టెలో ఆరు గజాల చీరను నేసిన ఘనత సిరిసిల్లదే. మరనేత, చేనేత పరిశ్రమకు ఎంతో ప్రసిద్ధి చెందింది. దక్షిణ కాశీ క్షేత్రంగా, కోడె మొక్కుల దేవుడిగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానం ఇక్కడే కొలువుదీరింది. కానీ, వర్షాభావ పరిస్థితులున్న మండలాల సంఖ్యా ఎక్కువే. ఎగువ మానేరు జలాశయం ఉంది.
* జిల్లా కేంద్రం: సిరిసిల్ల (జనాభా 91,344)
* రెండో పెద్దపట్టణం: వేములవాడ (జనాభా 50,158)
* రెవెన్యూ డివిజన్లు: సిరిసిల్ల
* మండలాలు: 13
* మంత్రి: కేటీఆర్‌
* నియోజకవర్గాలు: సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు
* ఎమ్మెల్యేలు: రమేష్‌బాబు, బొడిగె శోభ, రసమయి బాలకిషన్‌
పారిశ్రామిక ప్రగతి రథం

పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తున్న ప్రాంతాలతో మేడ్చల్‌ జిల్లా ఆవిర్భవించింది. ఉత్తర తెలంగాణను హైదరాబాద్‌ నగరానికి అనుసంధానం చేసే ప్రధాన పట్టణం మేడ్చల్‌. మేడ్చల్‌ అంటే ప్రకాశవంతమైన నగరమని అర్ధం. అందుకే నిజాం ఈ పట్టణాన్ని విడిది కేంద్రంగా ఎంచుకున్నారు. ద్రాక్షతోటలు, అందమైన విల్లాలకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రం.
* బాలానగర్‌, జీడిమెట్ల, ఉప్పల్‌ పారిశ్రామికవాడల్లో వేల సంఖ్యలో పరిశ్రమలున్నాయి. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారితో కలిపి లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
* కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. జైన, బౌద్ధమతాలకు సంబంధించి చారిత్రక ఆనవాళ్లు ఎన్నో వెలుగుచూశాయి.
* జిల్లా కేంద్రం: కీసర (జనాభా 72,400)
* రెండో ప్రధాన పట్టణం: కూకట్‌పల్లి (జనాభా 1,87,000)
* రెవెన్యూ డివిజన్లు: 2 (కీసర, మల్కాజ్‌గిరి)
* మండలాలు: 14
* నియోజకవర్గాలు: మేడ్చల్‌, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌
* ఎమ్మెల్యేలు: ఎం.సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, చింతల కనకారెడ్డి, కె.పి.వివేకానంద, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌.
రామయ్య ఆశీర్వాదం.. సింగరేణి సహకారం

భద్రాద్రి రామయ్య కొలువున్నది భద్రాద్రి జిల్లాలోనే. తెలంగాణ గుండెకాయ సింగరేణి సంస్థ ప్రధాన కార్యాలయమూ ఇక్కడే ఉంది. కేటీపీఎస్‌, జెన్‌కో విద్యుదుత్పత్తి ప్లాంట్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు కొత్తగూడెంలో ఉన్నాయి. ఉద్యోగులు అధికంగా నివసించే పట్టణమిదే.
* జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) ముడి ఇనుము శుద్ధికేంద్రం, మణుగూరులో భార జల కేంద్రం, సారపాకలో ఐటీసీ కాగితం పరిశ్రమ ఉన్నాయి.
* మణుగూరు, ఇల్లెందు, టేకులపల్లి, కోయగూడెంలో సింగరేణి బొగ్గుగనులు ఉన్నాయి.
* కొత్తగూడెంలో విమానాశ్రయం, మణుగూరులో భద్రాద్రి విద్యుదుత్పత్తి కర్మాగారం రానున్నాయి.
* పాల్వంచ, కొత్తగూడెం జంట పట్టణాలుగా విరాజిల్లే అవకాశముంది. 4.76 లక్షల అటవీ విస్తీర్ణం జిల్లా సొంతం.
* బోగత జలపాతం, పర్ణశాల, తాలిపేరు, పెద్దవాగు, మూకమామిడి, కిన్నెరసాని, పాలెంవాగు ప్రాజెక్టులు అదనపు ఆకర్షణ.
* జిల్లా కేంద్రం: కొత్తగూడెం (జనాభా 79819)
* రెండో పెద్ద పట్టణం: భద్రాచలం (జనాభా 50087)
* రెవెన్యూ డివిజన్లు: కొత్తగూడెం, భద్రాచలం
* మండలాలు: 23
* పట్టణాలు: 4
* నియోజకవర్గాలు: కొత్తగూడెం, పినపాక, అశ్వరావుపేట, భద్రాచలం, ఇల్లెందు.
* ఎమ్మెల్యేలు: జలగం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య, కోరం కనకయ్య.

ఎన్టీపీసీ, సింగరేణి అండగా.. పెద్దపల్లి

నిజాం కాలంలో ప్రత్యేక సంస్థానంగా వెలుగొందిన పెద్దపల్లి.. ప్రస్తుతం పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రధాన కేంద్రం. భారీ పరిశ్రమలు, బియ్యం మిల్లులు, విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలోని ప్రతి మండలానికి ఎస్సారెస్పీ నుంచి గోదావరి జలాలు అందుతాయి. హైదరాబాద్‌ - దిల్లీ రైలు మార్గంలో ప్రధాన రైల్వేస్టేషన్‌గా వెలుగొందుతోంది.
* ఎల్లంపల్లి, ఎల్‌మడుగు జలాశయాలు, రామగిరి ఖిల్లా, సబితం జలపాతం పర్యటకులను ఆకర్షిస్తున్నాయి.
* ఎన్టీపీసీ, సింగరేణి బొగ్గు గనులు, కేశోరాం సిమెంట్‌ ఫ్యాక్టరీ, జెన్‌కో విద్యుదుత్పత్తి కేంద్రం, సౌర విద్యుత్తు కేంద్రం ఉన్నాయి.
* జిల్లా కేంద్రం: పెద్దపల్లి (జనాభా 41,171)
* రెండో పెద్దపట్టణం: రామగుండం (జనాభా 2,31,539)
* రెవెన్యూ డివిజన్లు: పెద్దపల్లి, మంథని
* మండలాలు: 14
* నియోజకవర్గాలు: పెద్దపల్లి, రామగుండం, మంథని, ధర్మపురి
* ఎమ్మెల్యేలు: దాసరి మనోహర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు, కొప్పుల ఈశ్వర్‌.
సంగారెడ్డి.. పారిశ్రామిక ప్రగతికి చిరునామా..

హైదరాబాద్‌ నగరానికి సమీపంలోని ప్రధాన పట్టణం సంగారెడ్డి. గోదావరి ఉపనది మంజీరా బ్యారేజీ జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి సమీపంలోనే ఉంది. మొసళ్ల ఉత్పత్తి కేంద్రానికి చిరునామా. మంజీరా అభయారణ్యంలో దాదాపు 600 మొసళ్లు ఉంటాయని అంచనా. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి(నిమ్జ్‌), ఆసియా ఖండంలోనే పరిశ్రమలకు పెట్టింది పేరైన పటాన్‌చెరు పారిశ్రామిక వాడ అదనపు బలం.
* అర్ధశుష్క పంటల పరిశోధన కేంద్రం ఇక్రిశాట్‌, హైదరాబాద్‌ ఐఐటీ, ఎద్దుమైలారంలో ఆయుధ తయారీ కర్మాగారం, భెల్‌ ప్రధాన పరిశ్రమలు.
* సింగూరు జలాశయం, ఝరాసంగం కేతకీ సంగమేశ్వరాలయం పర్యాటక ప్రాంతాలు.
* జిల్లా కేంద్రం: సంగారెడ్డి (జనాభా 72359)
* రెండో పెద్ద పట్టణం: జహీరాబాద్‌ (జనాభా 52193)
* రెవెన్యూ డివిజన్లు: సంగారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌
* మండలాలు: 26
* నియోజకవర్గాలు: సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్‌, అందోల్‌, నారాయణఖేడ్‌
* ఎమ్మెల్యేలు: గీతారెడ్డి, ప్రభాకర్‌, మహిపాల్‌రెడ్డి, బాబూమోహన్‌, భూపాల్‌రెడ్డి
విత్తనక్షేత్రం.. కరీంనగర్‌

కరీంనగర్‌ పాతపేరు ఎలగందుల. హైదరాబాద్‌ సంస్థానంలో జిల్లా కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత ఖిలేదార్‌ కరీముద్దీన్‌ పేరుతో 1905లో కరీంనగర్‌ జిల్లా ఏర్పాటైంది. ఎలగందుల కోట కరీంనగర్‌ కేంద్రం నుంచి 14 కి.మీ దూరంలో ఉంది. నగరానికి దగ్గర్లో దిగువ మానేరు జలాశయం ఉంది. కరీంనగర్‌లో వెండితో వస్తువులు తయారుచేసే ఫిలిగ్రీ కళ ప్రపంచ గుర్తింపు పొందింది. కరీంనగర్‌ జిల్లా పరిధిలో దాదాపు 200 గ్రానైట్‌ పరిశ్రమలు, క్వారీలు నడుస్తున్నాయి. కరీంనగర్‌ డెయిరీ, మానకొండూరు, తిమ్మాపూర్‌ మండలాల్లోని విత్తనపరిశ్రమలు అదనపు బలం.
* జిల్లా కేంద్రం: కరీంనగర్‌ (జనాభా 2,89,821)
* రెండో పెద్దపట్టణం: హుజూరాబాద్‌ (జనాభా 74,721)
* రెవెన్యూడివిజన్లు: కరీంనగర్‌, హుజూరాబాద్‌ (కొత్తది)
* మండలాలు: 16
* పట్టణాలు: 3
* మంత్రులు: ఈటల రాజేందర్‌
* నియోజకవర్గాలు: కరీంనగర్‌, హుజూరాబాద్‌, చొప్పదండి, మానకొండూర్‌, హుస్నాబాద్‌
* ఎమ్మెల్యేలు: గంగుల కమలాకర్‌, బొడిగె శోభ, రసమయి బాలకిషన్‌, ఒడిదెల సతీష్‌బాబు
అసోంలో 35 జిల్లాలు

ఇప్పుడు తెలంగాణలో జిల్లాల సగటు విస్తీర్ణం 3,704 చదరపు కిలో మీటర్లు. దేశంలో మనకన్నా తక్కువ విస్తీర్ణంలోనే జిల్లాలు ఏర్పాటైన రాష్ట్రాలున్నాయి. తెలంగాణ జనాభా దాదాపు 3.5 కోట్లు. కేరళ, ఝార్ఖండ్‌, అసోం రాష్ట్రాల్లో జనాభా సంఖ్య మనతో దాదాపు సమానంగా ఉంది. అసోంలో 35 జిల్లాలుండగా.. సగటు జిల్లా విస్తీర్ణం 2241 చ.కి.మీ. కొండప్రాంతం కావడంతో పరిపాలన సౌలభ్యం కోసం ఎక్కువ జిల్లాలు ఏర్పాటయ్యాయి. జిల్లాల సంఖ్య ఆధారంగా ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం అత్యధిక జిల్లాలతో(75) దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండగా..తెలంగాణ 31 జిల్లాలతో 9వ స్థానానికి చేరింది.

No comments:

Post a Comment